Revanth Vs KCR: కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా కేసీఆర్‌ తాగే ఫుల్‌ బాటిలా?: రేవంత్‌ రెడ్డి నిలదీత

Revanth Reddy Fire On KCR In Medak Campaign Rally: మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి రెచ్చిపోయారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టలేరని.. కేసీఆర్‌, మోదీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 20, 2024, 03:35 PM IST
Revanth Vs KCR: కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా కేసీఆర్‌ తాగే ఫుల్‌ బాటిలా?: రేవంత్‌ రెడ్డి నిలదీత

Revanth Vs KCR: 'దేశంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు  ఆనాడు ఇక్కడి ప్రజలు మెదక్ గడ్డపై ఇందిరమ్మను గెలిపించారు. 1999 నుంచి 2024 వరకు 25 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ బీజేపీ, బీఆర్‌ఎస్ చేతిలోనే ఉంది. ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బీజేపీ, బీఆర్‌ఎస్ ఈ ప్రాంతానికి చేసిందేం లేదు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మెదక్ ప్రజలకు ఒరిగిందేం లేదు' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా నీలం మధు శనివారం నామినేషన్‌ చేశారు. అనంతరం జరిగిన సభలో రేవంత్‌ మాట్లాడారు.

Also Read: KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి

 

మెదక్‌ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 'దుబ్బాకలో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తానన్న రఘునందన్ రావును అడుగుతున్నా. మేమంతా బస్సులేసుకుని దుబ్బాక వస్తాం. నువ్వు తెచ్చిన నిధులేంటో.. చేసిన అభివృద్ధి ఏమిటో చూపించు' అని సవాల్ విసిరారు.

Also Read: Cash For Vote: రేవంత్‌ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కు

'పదేళ్లు మోదీ ప్రధానిగా, కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఈ పదేళ్లలో వాళ్లు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాకే ఓట్లు అడగాలి' అని రేవంత్‌ తెలిపారు. 'కేసీఆర్ పని అయిపోయింది.. కారు కార్ఖానాకు పోయింది. ఇక కారును తుక్కు కింద అమ్మాల్సిందే' అని విమర్శించారు. 'కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని కేసీఆర్ అంటుండు. అదేమైనా నువు తాగే ఫుల్ బాటిలా అయిపోవడానికి. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి. హైటెన్షన్  కరెంట్ వైర్.. బిడ్డా టచ్ చేసి చూడు' పునరుద్ఘాటించారు. 'చూస్తూ ఊరుకోవడానికి నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త!' అని రేవంత్‌ హెచ్చరించారు.

అధికారంలోకి వచ్చాక చేసిన పనులను రేవంత్‌ వివరించారు. 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించే ప్రజా పాలన మాది. రూ.22,500 కోట్లతో పేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటున్నాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం' అని వెల్లడించారు.

'మేం ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూస్తుంటే.. కడుపు మండిన మోదీ, కేసీఆర్ కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు' అని రేవంత్‌ ఆరోపించారు. 'తెలంగాణ రైతులకు ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగా మాట ఇస్తున్నా. పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది. వచ్చే పంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్, హరీష్ హామీలు నెరవేర్చలేదు. కానీ వందరోజుల్లోనే మమ్మల్ని దిగిపొమ్మంటున్నారు' అని విమర్శించారు.

'పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయం' అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలను అందించే బాధ్యత తనదని పేర్కొన్నారు. మెదక్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై రేవంత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ రైతుల భూములు గుంజుకున్న దుర్మార్గుడు వెంకట్రామిరెడ్డి అని ఆరోపించారు. మోదీని ఇంటికి పంపించాలి.. పేదవాడికి అండగా నిలబడేది ఈ మూడు రంగుల జెండానే అని రేవంత్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News